భారతదేశంలో బ్రాడ్ కాస్ట్, ఐసిటి, డిజిటల్ మీడియా కు సంబంధించిన అతిపెద్ద ప్రదర్శనగా పేరు మోసిన కన్వర్జెన్స్ ఎక్స్ పో న్యూఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఈరోజు ప్రారంభమైంది. ఇది 26 వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ రంగాలకు చెందిన అనేకమంది ప్రముఖులు తరలిరావటంతో ప్రగతి మైదాన్ కళకళలాడింది. కోవిడ్ నేపథ్యంలో ఇలాంటి ప్రదర్శనలకు నేరుగా హాజరయ్యే అవకాశం లేకపోగా ఈ ఏడాది కాలంలో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఏర్పడ్డ తొలి ప్రదర్శన ఇదే కావటం విశేషం.
1992 లో ప్రారంభమైన కన్వర్జెన్స్ ఇండియా వరుసగా భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ, భారతదేశపు టెక్నాలజీ ప్రదర్శనగా పేరుతెచ్చుకుంది. మొదట్లో కేవలం కమ్యూనికేషన్స్, ఐసిటి కి మాత్రమే పరిమితమైనా, క్రమంగా అన్నీ కలుపుకుంటూ కమ్యూనికేషన్స్, డిజిటల్ బ్రాడ్ కాస్ట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, అగ్ మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, రోబోటిక్స్, ఎంబెడెడ్ టెక్నాలజీ, మొబైల్ డివైసెస్, యాక్సెసరీస్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ ను కూడా కలుపుకోగలిగింది.
ఈ రోజు ప్రారంభమైన ప్రదర్శనలో వివిధ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ప్రదర్శించారు. ముఖ్యంగా టెలికామ్, బ్రాడ్ కాస్ట్, మొబైల్, ఐటి, డిజిటల్ మీడియా రంగాలవారితో బాటు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సంబంధిత సొల్యూషన్స్ కూడా ఇందులో స్టాల్స్ ఏర్పాటు చేశాయి.. ఈ పరిశ్రమలో ఉన్నవారు స్వయంగా పరిశీలించి కొత్త పరిజ్ఞానం పట్ల అవగాహన పెంచుకొని కొనుగోలు చేయటానికి ఎంతగానో అవకాశం కల్పిస్తోంది.
మొదటిరోజే ఐదువేల మందికి పైగా రాగా ఈ మూడు రోజులలో మొత్తం 25 వేలమందికి పైగా సందర్శకులు వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, కేబుల్ టీవీ వృత్తి నిపుణులు, శాటిలైట్ నిర్వాహకులు, టెలిపోర్ట్ ఆపరేటర్లతోబాటు వివిధ కేబుల్ సంఘాలు, బ్రాడ్ కాస్టింగ్ సంఘాల ప్రతినిధులు కూడా హాజరవుతారని భావిస్తున్నారు.