టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) సవరించి జారీ చేసిన కొత్త టారిఫ్ ఆర్డర్ విషయంలో ప్రస్తుతం బ్రాడ్ కాస్టర్లకు, ట్రాయ్ కి మధ్య కొనసాగుతున్న వివాదం సెప్టెంబర్ లో ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. కేసు విచారిస్తున్న జస్టిస్ ఎ ఎ సయీద్, జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్ లతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అన్ని పక్షాలూ తమ అభిప్రాయాలూ, అభ్యంతరాలూ సమర్పించటానికి ఆగస్టు 31 గడువు విధించగా ఈరోజుతో ఆ గడువు ముగిసింది.
చివరగా ఈ కేసు విచారణ సెప్టెంబర్ 2, 7, 8 తేదీలలో చేపడుతున్నట్టు కూడా కోర్టు ప్రకటించటంతో త్వరలోనే తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. కేసు విచారణ గురించి చెబుతూ, ట్రాయ్ నిబంధనలు అమలులోనే ఉంటాయని, స్టే ఇవ్వకపోయినా బ్రాడ్ కాస్టర్లమీద అమలుకు వత్తిఉడి తీసుకురావద్దని ధర్మాసనం ట్రాయ్ కి చెప్పింది. అదే సమయంలో ట్రాయ్, బ్రాడ్ కాస్టర్లతోబాటువసరమనుకుంటే ప్రభుత్వం కూడా తన వాదనను కోర్టుకు తెలియజేయ వచ్చునని సూచించింది.
ఇలా ఉండగా ట్రాయ్ ఈ కేసు విచారణ దృష్ట్యా, బ్రాడ్ కాస్టర్లు కొత్త టారిఫ్ ఆర్డర్ అమలు చేయాల్సిన గడువును మరింత పొడిగిస్తూ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 1న టారిఫ్ ఆర్డర్ జారీచేయగా అది కోర్టులో తీర్పు కోసం ఎదురుచూస్తున్న సమయంలో కరోనా సంక్షోభం రావటంతో ట్రాయ్ కూడా ఓపిక పట్టింది. అయితే జులై 24న ఆదేశాలు జారీ చేస్తూ ఆగస్టు 10లోగా అమలు చేయాలని కోరింది. అయితే కోర్టులో మళ్ళీ బ్రాడ్ కాస్టర్లు పిటిషన్ దాఖలు చేయటంతో తీర్పు రాకపోయినా, విచారణకు స్పష్టమైన తేదీలు ప్రకటించటంతో గడువు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది.
Good job