టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) జారీచేసిన రెండో టారిఫ్ ఆర్డర్ కు వ్యతిరేకంగా బ్రాడ్ కాస్టర్లు వేసిన పిటిషన్ మీద తీర్పు వాయిదా పడింది. కోర్టు ఇరుపక్షాల వాదనలూ వినటం పూర్తయింది. తీర్పు వచ్చేదాలా బ్రాడ్ కాస్టర్ల మీద ఎలాంటి వత్తిడీ పెట్టకూడదని బొంబాయ్ హైకోర్టు ఈ సందర్భంగా ట్రాయ్ ని ఆదేశించింది.
నిరుడు అమలు ప్రారంభమైన టారిఫ్ ఆర్డర్ స్థానంలో ఈ ఏడాది జనవరి 1 న ట్రాయ్ రెండో టారిఫ్ ఆర్డర్ జారీచేస్తూ బొకేలో ఉండే చానల్స్ ధరలమీద పరిమితి విధించటం, బొకే డిస్కౌంట్ మీద కూడా ఆంక్షలు పెట్టటం తెలిసిందే. దీన్ని బ్రాడ్ కాస్టర్లు బొంబాయ్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో తీర్పు రాకముందే జులై 24న ట్రాయ్ మళ్ళీ ఆదేశాలిస్తూ, బ్రాడ్ కాస్టర్లు ధరలపట్తిక విడుదలచేయాలని కోరింది. ఇది బ్రాడ్ కాస్టర్లను మరింత చికాకు పెట్టింది.
గడిచిన రెండేళ్లకాలంలో ట్రాయ్ నియంత్రణ మితిమీరిపోయిందన్నది. టెలివిజన్ పరిశ్రమ వాదన. నిజానికి మొదటి టారిఫ్ ఆర్డర్ అమలు జరిగిన తరువాత టీవీ చందాదారుల సంఖ్య 2కోట్ల 60 లక్షల దాకా పడిపోయిందని ఫిక్కీ నివేదిక వెల్లడించింది. బ్రాడ్ కాస్టర్లు ఒకవైపు కోవిడ్ ప్రభావం వల్ల యాడ్స్ తగ్గి సతమతమవుతున్న సమయంలో రెండో టారిఫ్ ఆర్డర్ అదనపు భారమని బ్రాడ్ కాస్టర్లు భావిస్తున్నారు.