విజయవాడ సిటీ డిజిటల్ అధిపతి సాయిబాబా తమ సంస్థ తరఫున 10 ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లను ప్రభుత్వాస్పత్రికి విరాళంగా ఇచ్చారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడుగా తమవంతు సాయమందించే క్రమంలో ఈ నిర్ణయం అమలు చేశారు. విజయవాడ సిటీ కేబుల్ వ్యవస్థాపకుడైన ఆయన సోదరుడు రామకృష్ణ జ్ఞాపకార్థం ఆయన చిత్రంతో కూడిన ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లను బహుకరించారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, ఇటీవలే మచిలీపట్నం సిటీ కేబుల్ ఎండీ ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లు ఇచ్చారని, ఆయన ప్రోద్బలంతో ఇప్పుడు విజయవాడ సిటీ డిజిటల్ అధినేత సాయిబాబు కూడా పది లీటర్ల సామర్థ్యముండే పది ఆక్సిజెన్ కాన్సంట్రేటర్లను బహూకరించారని చెబుతూ ఆయనను అభినందించారు. సాయిబాబు బాటలో ఇలా కోవిడ్ మీద పోరుకు అంతా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తూ, కోవిడ్ నియంత్రణ కోసం అన్ని జాగ్రత్తలూ పాటించాలని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కోరారు.
ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖామంత్రి పేర్ని వెంకట్రామయ్య (పేర్ని నాని), పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (కొడాలి నాని), కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, సాయిబాబు తనయుడు తదితరులు పాల్గొన్నారు.