టీవీ రేటింగ్స్ లెక్కింపు మీద రకరకాల ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విధానం మీద అధ్యయనానికి ప్రభుత్వం నియమించిన కమిటీ తన నివేదికను అందజేసింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నవంబర్ 4న ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ వెంపటుఇ చైర్మన్ గా త్రిసభ్య సంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. ఈ కమిటీకి రెండు నెలల సమయం ఇవ్వగా జనవరి 13న తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
విస్తృతంగా అధ్యయనం చేసిన మీదట ఈ నివేదికను రూపొందించారని స్వయంగా కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ వెల్లడించారు. అయితే, ఆ నివేదికలో ఉన్న సిఫార్సులగురించి మాత్రం ఆయన చెవ్పలేదు. దీన్ని సమగ్రంగా అధ్యయనం చేసిన మీదట సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటామని మాత్రమే మీడియాకు చెప్పారు. రేటింగ్స్ లో పారదర్సకత చాలా కీలకమని, ప్రస్తుతం కేవలం 55 వేల మీటర్ల సాయంతో లెక్కిస్తున్న రేటింగ్స్ లో కచ్చితత్వం, పారదర్శకత ఏ మేరకు ఉంటాయన్నదే ప్రశ్నార్థకమని వ్యాఖ్యానించారు.
“ మొత్తం నివేదికలోని అంశాలన్నిటినీ సమీక్షించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం. పారదర్శకమైన లెక్కింపు విధానం ఉండాలన్నదే ప్రాథమికంగా చాలా కీలకం. శాంపిల్ ఇళ్లలో ఏర్పాటు చేసే మీటర్ల సంఖ్యను విస్తరించటం ద్వారా సరైన సమాచారం రాబట్టగలిగే అవకాశాన్ని కూడా అధ్యయనం చేస్తాం. ఎలాంటి మార్గదర్శకాలు. ఆదేశాలు ఇవ్వాలన్నది పుర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు” అని జావడేకర్ మీడియాతో అన్నారు.