టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సవరించిన టారిఫ్ ఆర్డర్ అమలుకు ఆగస్టు 10 వరకూ అవకాశమిస్తూ జులై 24న జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ ఆ ఆర్డర్ అమలుకు ఆగస్టు 26 వరకు సమయం ఇచ్చింది. ఈ మేరకు ఈ రోజు ( 18-08-2020) నోటిఫికేషన్ జారీచేసింది. కోర్టులో ఈ విషయంలో పిటిషన్లు దాఖలై ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకోబోనని చెప్పిన ట్రాయ్ ఇప్పుడు ఆ మాటలనే నోటిఫికేషన్ రూపంలో ఇచ్చింది. అయితే గడువు ఆగస్టు 26 వరకు మాత్రమే ఇస్తున్నట్టు అందులో పేర్కొంది.
ఈ ఏడాది జనవరి 1న కొత్త టారిఫ్ ఆర్డర్ ఇస్తూ బ్రాడ్ కాస్టర్లు బొకేలో పెట్టే ఒక్కో చానల్ గరిష్ఠ ధర రూ.12 మాత్రమే ఉండాలని, బొకే మీద ఇచ్చే డిస్కౌంట్ 33 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని నిబంధన విధించింది. బొకేలోని చానల్స్ సగటు ధర కూడా తక్కువగా ఉండకూడదన్న నిబంధన ద్వారా ధరలు తగ్గించే ప్రయత్నం చేసింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం తీర్పు వాయిదా పడిందే తప్ప స్టే మాత్రం ఇవ్వలేదు. ఈలోపు కరోనా సంక్షోభం రావటంతో ట్రాయ్ కూడా పట్టుబట్టకూదదని తాత్కాలికంగా నిర్ణయించుకుంది.
అయితే జులై 24న మళ్లీ బ్రాడ్ కాస్టర్లకు లేఖ రాస్తూ ఆగస్టు 10లోగా అమలు చేయాలని ఆదేశించింది. దీంతో బ్రాడ్ కాస్టర్లు మళ్ళీ కోర్టులో మధ్యంతర దరఖాస్తులు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఈ కేసును 24 లోగా ఒక కొలిక్కి తెస్తామని కోర్టు చెప్పగా, ట్రాయ్ కూడా కోర్టు ఆదేశాలకోసం ఎదురుచూడటానికి అభ్యంతరం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో ట్రాయ్ ఈ రోజు ఈ నోటిఫికేషన్ విడుదలచేస్తూ బ్రాడ్ కాస్టర్లకు 26 వరకు అవకాశమిచ్చింది. అయితే, ఎమ్మెస్వోలు మాత్రం చాలామంది వారికి వర్తించే నిబంధనలు అమలు చేయటం మొదలుపెట్టారు.
Ok