ఇప్పటిదాకా ఇంటర్నెట్ కేబుల్ ద్వారా, టవర్స్ ద్వారా వై ఫై అందుబాటులో ఉంటూ ఉండగా ఉపగ్రహాల సాయంతో బ్రాడ్ బాండ్ కనెక్టివిటీ ఇవ్వటానికి అమెజాన్ ఒక భారీ పథకం చేపడుతోంది. ముందుగా ఇందుకోసం రూ. 1000 కోట్ల పెట్టుబడి పెట్టింది. 3,236 ఉపగ్రహాలతో నెట్ వర్క్ ఏర్పాటు చేయటం ద్వారా అత్యధిక వేగంతో సేవలందించటానికి ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాలో ఇందుకోసం అవసరమైన ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్ సి సి) నుంచి అనుమతి కూడా తీసుకుంది.
నిజానికి 2018 లోనే స్పేస్ ఎక్స్ సంస్థ సహా మరో రెండు సంస్థలు కూడా ఈ తరహా వ్యాపారం కోసం అనుమతి పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా బ్రాడ్ బాండ్ ఇంటర్నెట్ సేవలు అందించటం వీటి లక్ష్యం. ఇది అత్యంత భారీ ప్రాజెక్ట్ కావటంతో నిధులు కూడా అదే స్థాయిలో వెచ్చించాల్సి ఉంటుంది. 5G సేవలందించే వైర్ లెస్ కారియర్లకు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ సరికొత్త ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బాండ్ వలన మారుమూల ప్రాంతాలోనివారు కూడా విశేషంగా లాభపడతారు. ఆప్టికల్ ఫైబర్ లైన్లు వేయటం, టవర్లు నిర్మించటం సాధ్యం కాని చోట, లాభదాయకం కానిచోట కూడా ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. మరీ ముఖ్యంగా తుపానులు, భూకంపాలవంటి ప్రకృతి బీభత్సాల కారణంగా సేవలు నిలిచిపోయే ప్రమాదముందదు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావటం కూడా ఇందులో ప్రత్యేకత.