తెలంగాణలో అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్స్ లో ఒకటైన బ్రైట్ వే తన పరిధిలోని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ఈ మేరకు సంస్థ ఎండీ శ్రీ సుభాష్ రెడ్డి తన ఆలోచనలను కేబుల్ సమాచార్ తో పంచుకున్నారు. జరగబోయే పరిణామాలను అంచనావేసి రంగంలో దిగినప్పుడే ఆర్థికంగా బలపడతామని ఆయన కేబుల్ ఆపరేటర్లకు పిలుపునిచ్చారు.
సాంకేతికంగా మార్పులు వస్తున్న సమయంలో ఎదురీదటం అసాధ్యమని తెలియటం వలన మార్పును మనకు అనుకూలంగా మార్చుకోవటమే సరైన పద్ధతి అన్నారు. డిజిటైజేషన్ లో వచ్చిన మార్పులు ఒకవైపు, కోవిడ్ సంక్షోభం కారణంగా బ్రాడ్ బాండ్ అవసరాలు పెరగట మరోవైపు గమనిస్తున్న కేబుల్ ఆపరేటర్లు ఈ మార్పులను ఒక ఆదాయ వనరుగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఆపరేటర్ల అవసరాలకు తగినట్టుగా బ్రాడ్ బాండ్ సేవలు అందించేందుకు బి ఎస్ ఎన్ ఎల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు.
స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఎఫ్ టి టి హెచ్ ద్వారా ఇంటింటికీ బ్రాడ్ బాండ్ అందించగలిగితే ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించినవారమవుతామన్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్. ఒటిటి వేదికల డిమాండ్ పెరుగుతున్న సమయంలో గ్రామాలలో కూడా ఇంటర్నెట్ కు డిమాండ్ పెరుగుతున్నందున దీన్ని కేబుల్ ఆపరేటర్లు అవకాశంగా మార్చుకుంటే తగినంత అదనపు ఆదాయం వస్తుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ రంగ సంస్థ బి ఎస్ ఎన్ ఎల్ తో బ్రైట్ వే కుదుర్చుకున్న ఒప్పందం వలన కేబుల్ ఆపరేటర్లకు అదనపు ఆదాయం పెరుగుతుందన్నారు.
అదే విధంగా ఈ-కామర్స్ ద్వారా ప్రజలకు చేరువై లాభాలు పొందే విధానాన్ని సైతం బ్రైట్ వే రూపొందించిందని శ్రీ సుభాష్ రెడ్డి తెలియజేశారు. స్థానికంగా ప్రజలకు వివిధ సామగ్రిని నేరుగా ఇంటికే అందించగలగటం ఈ-కామర్స్ ప్రత్యేకతగా అభివర్ణిస్తూ, ముందు ముందు ఈ వ్యాపారానికి ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేసుకొని రంగంలోకి దిగాలని కేబుల్ ఆపరేటర్లకు ఆయన విజ్ఞప్తి చేశారు.
Nice 👌 thought. I am looking for Andhra also
Exactly Right Opinion in This Stage