తెలుగు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో పేరు మోసిన జీ తెలుగు చానల్ యాజమాన్యం ప్రజలలో అవగాహన పెంచటంలోనూ, తన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిర్వర్తించటంలోనూ ఎప్పుడూ ముందుంటుంది. కోవిడ్ సమయంలోనూ ఎంతోమందికి ఆహారం అందించటంతోబాటు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంబులెన్సులు అందజేసిన ఘనమైన చరిత్ర ఈ జీ గ్రూప్ చానల్ కు ఉంది.
ఇప్పుడు గణేశ ఉత్సవాల సందర్భంగా మరోసారి సరికొత్త ఆలోచనను అమలు చేస్తూ ముందుకొచ్చింది. మట్టి గణేశులను అందజేయటం ద్వారా పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన పెంచుతోంది. నిరుటి లాగానే ఈ ఏడాది కూడా జీ తెలుగు యాజమాన్యం రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎమ్మెస్వోలకు, ఆపరేటర్లకు తమ కస్టమర్లకు మట్టి గణపతులను పంపిణీ చేసింది.
ఈ మట్టి గణేశునిలో ఒక విత్తనం ఉండటం వలన పూజ అనంతరం నిమజ్జన సమయంలో విగ్రహం మీద నీరు పోయటం వలన ఆ మట్టి కరిగిపోయి కొబ్బరిపీచు కుండీలో ఉండిపోతుంది. అందులోనుంచి విత్తనం మొలకెత్తి మొక్కగా మారుతుంది. ఆ విధంగా పచ్చదనానికి కూడా దోహదం చేసినట్టవుతుంది.
తెలంగాణలో అతిపెద్ద కేబుల్ నెట్ వర్క్స్ లో ఒకటైన బ్రైట్ వే కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సుభాష్ రెడ్డి ఈ సందర్భంగా జీ తెలుగు యాజమాన్యాన్ని అభినందించారు. సంస్థ ఏటా ప్రతి పండుగనూ అర్థవంతంగా జరుపుతూ రావటం ఆనవాయితీగా మారిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటూ మట్టి గణేశులను అందించిన జీ ప్రతినిధులు శ్రీ వెంకట్ సారథి, నేషనల్ సేల్స్ హెడ్, శ్రీ ఉమాకాంత్, సర్కిల్ హెడ్ , ఏపీ అండ్ తెలంగాణ, శ్రీ ఉదయ్ కిరణ్, తెలంగాణ హెడ్, శ్రీ శాస్రి, సీనియర్ మేనేజర్, శ్రీ గిరీష్. అసిస్టెంట్ మేనేజర్ లకు కృతజ్ఞతలు తెలియజేశారు.