టీవీ పరిశ్రమలో జీ తెలుగు చానల్ కు పదహారేళ్ళు నిండాయి. 2005 మే 18న మొదలైన చానల్ ఎప్పటికప్పుడు జనరంజక కార్యక్రమాలు రూపొందిస్తూ, ప్రేక్షకాదరణ పొందుతూ కొంత కాలంగా స్థిరంగా రెండో స్థానంలో ఉంటోంది. తెలుగులో ఆలస్యంగా ప్రవేశించినా, ఆలస్యంగా సినిమా చానల్ జోడించినా తన ప్రత్యేక నిలబెట్టుకుంది. ఈ పదహారేళ్ళ పండుగ జరుపుకుంటున్న సమయంలొనే జీ తెలుగు చానల్ ఆలిండియా తొమ్మిదో రాంకు కొనసాగిస్తూ జీ గ్రూప్ చానల్స్ అన్నిటికంటే ముందుండటం విశేషం.
ఈ పదహారేళ్ళ వేడుకను జీ మహోత్సవం పేరుతో ప్రత్యేక కార్యక్రమంగా చిత్రించగా ఈ ఆదివారం (16వ తేదీ) సాయంత్రం 5 గంటలనుంచి ప్రసారం చేయటానికి ఆ చానల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ఒకవైపు కోవిడ్ మహమ్మారి, లాక్ డౌన్ నిబంధనలు భయపెడుతున్నా ప్రజాప్రయోజనాల దృష్ట్యా పూర్తి స్థాయిలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ స్టుడియో లోనే ఈ భారీ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు.
ఈ పదహారేళ్ల వేడుక “జీ మహోత్సవం” శ్రీముఖి హోస్ట్ గా సాగింది. మ్యూజిక్, డాన్స్, కామెడీ కలగలసిన ఈ కార్యక్రమంలో సినీనటుడు అలీ, బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర సహా టీవీలో కనిపించే ప్రముఖ నట్తీనటులందరూ పాల్గొన్నారు. ప్రభాకర్, రవికృష్న, పవన్ తనూజ లాంటివారి జీవిత ప్రయాణాన్ని ప్రతిబింబించే కార్యక్రమాన్ని కూడా ఇందులో చూడవచ్చు. 16 నిమిషాలపాటు సాగే 16 పాటల కదంబంగా ఈ ఈవెంట్ లో ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు. జీ కుటుంబం డాన్స్ దీనికి తోడవుతుంది.
ఈ ఏడాదంతా ప్రజలకు, వ్యాపారానికీ అనేక ఇబ్బందులు ఎదురైనా టీకాలు అందుబాటులోకి రావటమన్నది ఆశాకిరణంగా కనిపిస్తున్నదని, అయినప్పటికీ అందరూ జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ళలో ఉండిపోవాలని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ తెలుగు క్లస్టర్ హెడ్ అనూరాధ గూడూర్ అన్నారు. వైవిధ్య భరితమైన కార్యక్రమాలతో జీ తెలుగు అన్ని కుటుంబాలను ఒకచోట చేర్చిందని చెబుతూ, ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితుల మధ్య ప్రజల అభిరుచికి అనుగుణంగా ప్రసారాలు అందించటం జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ కు ఒక సవాలే అయినా, ఎప్పటికప్పుడు కొత్తదనం చూపటంలో జీ తెలుగు విజయం సాధించిందన్నారు. పదహారేళ్ళుగా చానల్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.