ఓటీటీలకు టీవీ ప్రసారాలు అందించటం మీద బ్రాడ్ కాస్టర్లకు లేఖ రాయటాన్ని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) సమర్థించుకుంది. ఈ మేరకు టెలికాం డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టీడీశాట్) కు ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బ్రాడ్ కాస్టర్లు తాము ప్రసారం చేస్తున్నటీవీ చానల్స్ ను యథాతథంగా ఓటీటీ వేదికలకు పంపుతున్న వైనం మీద వివరణ కోరుతూ ట్రాయ్ రాసిన లేఖ మీద బ్రాడ్ కాస్టర్లు టీడీశాట్ లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రాయ్ తన వివరణను అఫిడవిట్ రూపంలో టీడీశాట్ కు అందజేసింది.
2021 నవంబర్ 25 న ట్రాయ్ రాసిన లేఖను సవాలు చేసిన బ్రాడ్ కాస్టింగ్ సంస్థలలో స్టార్ ఇండియా, సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా, సన్ టీవీ నెట్వర్క్ ఉన్నాయి. ఏ మాధ్యమం ద్వారా ఓటీటీకి ప్రసారాలు అందజేస్తున్నారో తెలియజేయాలంటూ కోరటం ట్రాయ్ తన అధికార పరిధిని అతిక్రమించటమేనని బ్రాడ్ కాస్టర్లు ఆరోపించారు. ఓటీటీ మీద అధికారం ట్రాయ్ కి లేదని గుర్తు చేస్తూ, ఆ సమాచారాన్ని ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
అయితే, బ్రాడ్ కాస్టర్ల వాదనలో పస లేదంటూ ట్రాయ్ త్రోసిపుచ్చింది. తాను ఓటీటీలను నియంత్రించటానికి ఆ లేఖ రాయలేదని, బ్రాడ్ కాస్టర్లను నియంత్రించటానికి ట్రాయ్ చట్టంలోని సెక్షన్ 12(1)(ఏ) తోబాటు సెక్షన్ 11(1)(బి)(i) కింద సంక్రమించిన అధికారాలను మాత్రమే వినియోగించానని ఆ అఫిడవిట్ లో స్పష్టం చేసింది. పైగా, తాను వివరణ కోరింది బ్రాడ్ కాస్టర్లనే తప్ప ఓటీటీ వేదికలను కాదని గుర్తు చేసింది. బ్రాడ్ కాస్టర్లను, కేబుల్ సర్వీసులను నియంత్రించటం మీద ఇప్పటికే ఉన్న ఇంటర్ కనెక్షన్ రెగ్యులేషన్ ను అమలు చేయటంలో భాగమే ఆ లేఖ అని కూడా ట్రాయ్ స్పష్టం చేసింది.
అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ నిబంధనలకు విఘాతం కలుగుతుందనుకున్నప్పుడు సమాచారం కోరే హక్కు తనకున్నదని ట్రాయ్ ఆ అఫిడవిట్ లో పేర్కొంది. శాటిలైట్ చానల్స్ కు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి మంజూరు చేసినప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన చానల్ పేరు, లోగోతో ఉంటుందని, అవి పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డీటీహెచ్, హిట్స్, ఐపీటీవీ ఆపరేటర్ల ద్వారా వినియోగదారులకు చేరాల్సి ఉంటుందని గుర్తు చేసింది.
టీడీశాట్ ఈ అఫిడవిట్ ను అందుకున్న మీదట తదుపరి విచారణను మార్చి 3వ తేదీకి వాయిదావేసింది. సమాచారం ఇవ్వలేదన్న కారణంగా బ్రాడ్ కాస్టర్ల మీద చర్యలు తీసుకోవద్దంటూ గత విచారణ సందర్భంగా ట్రాయ్ ని టీడీశాట్ ఆదేశించిన సంగతి తెలిసిందే.