ఓటీటీలకు సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఎలాంటి లైసెన్స్ గాని అనుమతి గాని ఇవ్వటం లేదు గనుక వాటి నీయంత్రణ తమ పరిధిలోకి రాదని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మరోమారు తేల్చి చెప్పింది. పే చానల్ బ్రాడ్ కాస్టర్లు కొత్త టారిఫ్ ఆర్డర్ నెపంతో ధరలు పెంచకుండా చూడాలని తమిళనాడు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఇచ్చిన లీగల్ నోటీసుకు స్పందిస్తూ ట్రాయ్ తన న్యాయవాదుల ద్వారా ఈ వివరణ ఇచ్చింది.
కొత్త టారిఫ్ ఆర్డర్ ( ఎన్టీవో 2.0) ముసుగులో పే చానల్ బ్రాడ్ కాస్టర్లు ధరలు పెంచకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ 2021 అక్టోబర్ 18 న తమిళనాడు కేబుల్ ఆపరేటర్లు ట్రాయ్ కి లీగల్ నోటీస్ ఇచ్చారు. అయితే, బ్రాడ్ కాస్టర్లు ప్రకటించిన ధరల అమలు వ్యవహారాన్ని ఏప్రిల్ 1 కి వాయిదా వేస్తూ, కొత్త ధరల ప్రకటనకు 2021 డిసెంబర్ 31వరకు బ్రాడ్ కాస్టర్లకు అవకాశమిచ్చిన విషయాన్ని ట్రాయ్ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఈ లీగల్ నోటీస్ ను ఉపసంహరించు కోవాలని సూచించింది.
ఓటీటీని ట్రాయ్ నియంత్రించటం లేదన్న విషయాన్ని మరో మారు స్పష్టం చేస్తూ, లీగల్ నోటీస్ వెనక్కి తీసుకోవాలని కోరింది. అయితే, ధరలపెంపును అడ్డుకోవటం మీద ట్రాయ్ నుంచి ఎలాంటి స్పష్టతా లేనందున తమిళనాడు డిజిటల్ కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం ఈ లీగల్ నోటీస్ ను ఉపసంహరించుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.