“పే చానల్ చందా నెలరోజులకే, 4 వారాలకు కాదు”

0
420

కొంతమంది డిటిహెచ్ ఆపరేటర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలు పే చానల్ చందాలను నెల రోజుల ప్రాతిపదికన కాకుండా నాలుగు వారాల లెక్కన వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా నెలవారీ పే చానల్ ధరను ట్రాయ్ నిర్ణయించినప్పుడు నెలకు వసూలు చేసుకునే గరిష్ఠ ధర ప్రకటించాలని కోరింది. చానల్స్ అందుకు అనుగుణంగానే నెలకు గరిష్టంగా రూ.19 నిర్ణయించారు. అయితే, కొంతమంది డిటిహెచ్ ఆపరేటర్లు, కార్పొరేట్ ఎమ్మెస్వోలు అతి తెలివి చూపుతూ నాలుగు వారాలకు ఆ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. ఆ విధంగా నెలకు రెండు రోజుల ఆదాయాన్ని సొంత ఖాతాలో జమ వేసుకుంటున్నారు.
ఈ వైఖరి మీద వెంటనే చర్య తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మల్టీ సిస్టమ్ ఆపరేటర్ల ( ఎమ్మెస్వోల) సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ పి. మోహన్ టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చైర్మన్ కు లేఖ రాశారు. చందాదారులనుంచి ఆ విధంగా వసూలు చేస్తూ బ్రాడ్ కాస్టర్లకు మాత్రం 30 రోజుల ప్రాతిపదికనే చెల్లించటం ద్వారా మోసానికి పాల్పడుతున్న పంపిణీ సంస్థలమీద చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఈ లేఖ ప్రతిని కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రకాశ్ జావడేకర్ కు కూడా పంపారు.
టీవీ ప్రేక్షకుల, కేబుల్ ఆపరేటర్ల, పంపిణీదారుల ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ, దాదాపు 9% మేర అదనంగా వసూలు చేస్తున్న పంపిణీ సంస్థల మీద చర్యలు తీసుకోవాలని, టారిఫ్ ఆర్డర్ లో పేర్కొన్న విధంగా చందా మొత్తాన్ని నాలు వారాలు (28 రోజులకు) కాకుండా నెలకు (30 రోజులకు) వర్తింప జేయాలని శ్రీ మోహన్ ఆ లేఖలో డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here