ముంబై పోలీసులు ఇచ్చిన సమన్లు రద్దుచేయాలంటూ రిపబ్లిక్ టీవీ, ఆ సంస్థ చీఫ్ ఆర్ణబ్ గోస్వామి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు త్రోసిపుచ్చింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్స్ ( టిఆర్పీలు) గోల్ మాల్ చేసిన వ్యవహారంలో దాఖలైన ఎఫ్ ఐ ఆర్ కు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ముంబై పోలీసులు ఆర్ణబ్ గోస్వామికి ముంబయ్ పోలీసులు సమన్లు పంపిన సంగతి తెలిసిందే.
అయితే రిపబ్లిక్ మీడియా నెట్ వర్క్ తరఫున ఆర్ణబ్ దాఖలు చేసిన పిటిషన్ ను స్వీకరించటనికి ఈరోజు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముందుగా బొంబాయ్ హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. తమకు హైకోర్టుల మీద నమ్మకముందని, కరోనా సంక్షోభసమయంలోనూ అవి నిరంతరాయంగా పనిచేశాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.
రిపబ్లిక్ సంస్థకు చెందిన అధికారులను విచారణకు పిలిచి ముంబయ్ పోలీసులు గంటల తరబడి ఇంటరాగేషన్ చేస్తున్న నేపథ్యంలో దీని నుంచి విముక్తి పొందాలన్న అభిప్రాయంతో ఆర్ణబ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ముంబయ్ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వ పెద్ద ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటున్నారంటూ ఆర్ణబ్ ఆరోపించటం తెలిసిందే.