సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిషేధించిన మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్’ కు స్టే రూపంలో సుప్రీం కోర్టులో ఊరట లభించింది. దీంతో చానల్ ప్రసారాలు తిరిగి మొదలయ్యాయి. మళ్ళీ ఆదేశాలు ఇచ్చేదాకా ప్రసారాలు కొనసాగించటానికి సుప్రీంకోర్టు అవకాశమిచ్చింది.
హోంశాఖ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇవ్వని కారణంగా చానల్ ప్రసారాలు నిలిపివేస్తూ సంచార, ప్రసార మంత్రిత్వశాఖ తాను ఇచ్చిన అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ అనుమతులను ఉపసంహరించుకుంటున్నట్టు తేల్చి చెప్పటంతో ఈ ఏడాది జనవరి 31 న చానల్ ప్రసారాలు మొదటిసారి ఆగిపోయాయి. అయితే, చానల్ యాజమాన్యం కేరళ హైకోర్టును ఆశ్రయించగా మొదట ఫిబ్రవరి 2 వరకు, ఆ తరువాత ఫిబ్రవరి 7 వరకు స్టే ఇచ్చింది. ఈలోపు హోంశాఖ క్లియరెన్స్ నిరాకరణకు కారణాలు చూపటంతో స్టే రద్దయింది. 8 వ తేదీ నుంచి చానల్ ప్రసారాలు ఆగిపోయాయి.
ఆ తరువాత చానల్ యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ మళ్ళీ మీడియా వన్ చానల్ కు ఊరట లభించింది. ఎం ఐ బి నిషేధపు ఉత్తర్వులమీద మార్చి 15 న సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మార్చి 16 న చానల్ తన ప్రసారాలు పునరుద్ధరించింది. మళ్ళీ ఆదేశాలు ఇచ్చేదాకా ప్రసారాలు కొనసాగించటానికి కోర్టు అవకాశమిచ్చింది.