ఎమ్మెస్వోలు తమ యాక్టివ్ సెట్ టాప్ బాక్సుల తాజా సమాచారాన్ని వెంటనే అందజేయాలని సమాచార ప్రసార మంత్రిత్వశాఖ (ఎంఐబీ) ఆదేశాలు జారీచేసింది. మంత్రిత్వశాఖ వారి మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ( ఎం ఐ ఎస్) లో తక్షణమ్ అప్ లోడ్ చేయాలని ఆ ఆదేశాలలో పేర్కొంది. వెంటనే ఈ నిబంధనను పాటించకపోతే ఎమ్మెస్వో రిజిస్ట్రేషన్ రద్దు చేయటమో, సస్పెండ్ చేయటమో తప్పదని హెచ్చరించింది.
ఫిబ్రవరి 1 వ తేదీతో విడుదలైన ఈ తాజా సూచనలో ఎమ్మెస్వోల నిర్లక్ష్య ధోరణిని మంత్రిత్వశాఖ ప్రస్తావించింది. అనేకమార్లు గుర్తు చేసినప్పటికీ చాలామంది ఎమ్మెస్వోలు తమ నెట్ వర్క్ లోని యాక్టివ్ సెట్ టాప్ బాక్సుల సమాచారాన్ని మంత్రిత్వశాఖ ఎం ఐ ఎస్ లో అప్ డేట్ చేయటం లేదని పేర్కొంది. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి, నియంత్రణ పరమైన చర్యలకు కేబుల్ టీవీ చందాదారుల సంఖ్య చాలా అవసరమని మంత్రిత్వశాఖ గుర్తు చేసింది.
తాజయ సమాచారాన్ని అందించటంలో విఫలమైతే అది కేబుల్ టెలివిజన్ నెట్ వర్క్ రూల్స్-1994 లోని 10 ఎ నిబంధనను ఉల్లంఘించినట్టేనని కూడా హెచ్చరించింది. ఆలా నిర్లక్ష్యం చేస్తే ఎమ్మెస్వో లైసెన్స్ /రిజిస్ట్రేషన్ రద్దు చేయటానికి కూడా అవకాశముందని ఈ ఆదేశాలలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అడిగినప్పుడు ఈ సమాచారం ఇవ్వాలని 10 ఎ నిబంధన చెబుతోందని గుర్తు చేసింది.