స్టార్, డిస్నీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ కె. మాధవన్ టీవీ బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్) కు అధ్యక్షునిగా ఎంపికయ్యారు. స్టార్ లో 2009 లో చేరిన మాధవన్ గత డిసెంబర్ లో డిస్నీ, స్టార్ ఇండియా ఎండీగా నియమితులయ్యారు. ఇంతకు ముందు ఆయన ఐబిఎఫ్ ఉపాధ్యక్షునిగా ఉంటూ వచ్చారు. ఈ రోజు జరిగిన ఐబిఎఫ్ 21వ సర్వసభ్య సమావేశం ఆయనను ఏకగ్రీవంగా ఈ పదవికి ఎంపికచేసింది. ఇప్పటివరకు సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ సీఈవో ఎన్ పి సింగ్ ఈ అధ్యక్షపదవిలో ఉంటూ వచ్చారు.
ఈ పదవికి ఎంపికకావటం పట్ల మాధవన్ సంతోషం వ్యక్తం చేస్తూ, నియంత్రణ పరంగా సమస్యలు ఎదుర్కుంటున్న సమయంలో ఈ పదవి చేపట్టటం ఒక సవాలు వంటిదేనన్నారు. బ్రాడ్ కాస్టింగ్ పరిశ్రమ ప్రయోజనాలకోసం ఐబిఎఫ్ ద్వారా ఇంతకు ముందు అధ్యక్షులు చేసిన కృషిని కొనసాగిస్తానన్నారు. బ్రాడ్ కాస్టింగ్ రంగం లాభపడేలా, సమస్యలు పరిష్కారమయ్యేలా అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.
ఐబిఎఫ్ కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా ఇండియా టీవీ చైర్మన్ రజత్ శర్మ, టర్నర్ ఇంటర్నేషనల్ దక్షిణాసియా మేనేజింగ్ దైరెక్టర్ సిద్దార్థ్ జైన్, వయాకామ్ 18 ఎండీ రాహుల్ జోషీ ఎంపిక కాగా, ప్రసారభారతి సీఎవో శశి ఎస్ వెంపటి కోశాధికారిగా ఎంపికయ్యారు. ఐబిఎఫ్ లో డైరెక్టర్లుగా అరుణ్ పూరి (టీవీ టుడే). ఎన్ పి సింగ్ ( సోనీ), ఐ. వెంకట్ (డైరెక్టర్, ఈనాడు టీవీ). పునీత్ గోయెంకా (జీ మీడియా), రోహిత్ గుప్తా ( సోనీ ఇంటర్నేషనల్), ఉదయ శంకర్ (వాల్ట్ డిస్నీ , స్టార్ అండ్ డిస్నీ ఇండియా) మేఘా తాతా (డిస్కవరీ), జాన్ బ్రిట్టాస్ (మలయాళం కమ్యూనికేషన్స్) ఎంపికయ్యారు.