అందంగా కనబడటానికి ప్రాధాన్యమిచ్చే యాంకర్లు న్యూస్ స్టుడియోలో మాస్క్ వేసుకుంటారా? అందంకంటే వార్తలతోబాటు సమాజానికి ఇవ్వాల్సిన సందేశమే ముఖ్యమని కేరళలో ఏషియానెట్ న్యూస్ చానల్ నిర్ణయించుకుంది. న్యూస్ యాకర్లందరూ కచ్చితంగా మాస్క్ ధరించే వార్తలు చదవాలనే నిబంధన పెట్టింది. మాస్క్ అవసరం గురించి ప్రజలకు సందేశమిచ్చేవాళ్ళు మాస్క్ లోనే ఉండాలని ఏషియానెట్ బలంగా నమ్మింది. ఈ చర్యతో ప్రజల అభిమానం పొందిన ఏషియానెట్ ను ఆదర్శంగా తీసుకొని మరికొన్ని మలయాళీ న్యూస్ చానల్స్ కూడా అదే బాట పట్టాయి.
వార్తలు చదువుతూ మాస్క్ ధరించటం కొంచెం ఇబ్బందేనని ఏషియానెట్ వార్తావిభాగం అధిపతి, సీనియర్ జర్నలిస్ట్ రాధాకృష్ణన్ అంటారు. వార్త అర్థమవటానికి హావభావాలు కూడా ముఖ్యమని, వార్తాసందేశం అందించటానికి ముఖం కనపడాల్సి ఉన్నా, ఈ ప్రత్యేక సందర్భంలో మాస్క్ కి ఉన్న ప్రాధాన్యాన్ని ప్రజలకు తెలియజెప్పటానికి తమ యాంకర్లు అందరూ ఈ నిబంధన పాటిస్తున్నారని చెప్పారు. తమ స్టుడియోలో చర్చల్లో పాల్గొనటానికి వచ్చే గెస్ట్ లకు కూడా ఈ నిబంధన వర్తింపజేస్తున్నామన్నారు. ఏషియానెట్ ను ఆదర్శంగా తీసుకొని ఇప్పుడు మరికొన్ని చానల్స్ కూడా న్యూస్ యాంకర్లకు మాస్క్ నిబంధన పెట్టటం ఆనందంగా ఉందంటున్నారు.