ప్రస్తుతం దేశం ఎదుర్కుంటున్న కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రభుత్వం తీసుకుంటున్న అనేక సహాయ చర్యలకు అండగా నిలబడేందుకు ప్రముఖ బ్రాడ్ కాస్టింగ్ నెట్ వర్క్ స్టార్ ఇండియా తన మాతృ సంస్థ డిస్నీ తో కలసి రూ. 50 కోట్లు విరాళం ప్రకటించింది. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. ఈ కీలక సమయంలో అత్యంత అవసరమైన మందులు, వెంటిలేటర్లు, ఆక్సిజెన్ సిలిండర్లు వంటి వైద్య పరికరాలకోసం ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా వినియోగించుకునేందుకు వీలుగా సహాయం ప్రకటిస్తున్నట్టు పేర్కొంది.
నిరుడు 2020 లో కోవిడ్ సంక్షోభ సమయంలో వాల్ట్ డిస్నీ, స్టార్ ఇండియా ప్రకటించిన రూ 28 కోట్లకు అదనంగా ఈ సహాయమని కూడా అందులో స్పష్టం చేసింది. అదే విధంగా కోవిడ్ సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలమీద ప్రజలలో అవగాహన పెంచేందుకు ప్రజాప్రయోజన ప్రకటనలు రూపొందించి ప్రాచుర్యం కల్పిస్తున్న విషయాన్ని కూడా స్టార్ ఇండియా ఈ సందర్భంగా గుర్తు చేసింది.
వాల్ట్ డిస్నీ కంపెనీ ఇండియా, స్టార్ ఇండియా ప్రెసిడెంట్ అయిన కె మాధవన్ ఈ విషయమై “ కోవిడ్ మీద పోరులో మేం దేశానికి అందగా నిలబడతాం. అందుకే సహాయ చర్యలకోసం వాల్ట్ డిస్నీ ఇండియా, స్టార్ ఇండియా తమ వంతుగా రూ. 50 కోట్లు విరాళమిస్తున్నాయి. “ అన్నారు. కీలకమిఅన ఆరోగ్య పరికరాలు అందించి ప్రజల ప్రాణాలు కాపాడటం ఇప్పుడు ఎంతో అవసరం. నిరుడు 28 కోట్లు ఇచ్చాం. ఇప్పుడు మరో 50 కోట్లు ఇస్తున్నాం” అన్నారు.
డిస్నీ ఎంప్లాయీ మాచింగ్ గిఫ్ట్ పేరుతో డిస్నీ-స్టార్ ఒక ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సంస్థ ఉద్యోగులెవరైనా ఏదైనాగుర్తింపు పొందిన సంస్థకు విరాళం ఇవ్వదలచుకుంటే అంతే మొత్తాన్ని సంస్థ కూడా జోడించి ఇస్తుంది. ఈ పద్ధతిని ఇప్పుడు కూడా కొనసాగిస్తుంది.