డీడీ టెరెస్ట్రియల్ ప్రసారాల ట్రాన్స్ మిటర్లకు మంగళం

0
660

యాంటెన్నా పెట్టుకొని చూసిన దూరదర్శన్ ఇప్పుడు చరిత్రలో కలిసిపోవటానికి సిద్ధమవుతోంది. జమ్ము కాశ్మీర్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షదీవులు, తదితర వ్యూహాత్మక ప్రదేశాలలో మాత్రమే కొనసాగిస్తుండగా ఈశాన్య రాష్ట్రాలలో వచ్చే మార్చి ఆఖరుకు మూసేస్తున్నారు. ఆ విధంగా టవర్ల ఆధారంగా వాయు తరంగాల ద్వారా అందే ప్రసారాలు కనుమరుగవుతున్నాయి. 1959 సెప్టెంబర్ 15 న ప్రారంభమైన టెరెస్ట్రియల్ టీవీ సరిగ్గా 62 ఏళ్ల తరువాత తెరమరుగవుతోంది. 1982 లో శాటిలైట్ ప్రసారాలు, కలర్ టీవీ అందుబాటులోకి వచ్చిన తరువాత కూడా మారుమూల ప్రాంతాల్లో సామాన్యులకు సైతం ప్రసారాలు అందుబాటులో ఉంచాలన్న ఏకైక లక్ష్యంతో ఇన్నాళ్ళూ కొనసాగించారు.

స్పోర్ట్స్ ప్రసార హక్కులు కొనుక్కున్న బ్రాడ్ కాస్టర్లు భారత జట్లు పాల్గొంటున్న క్రీడల ప్రసారాలను దూరదర్శన్ కు తప్పనిసరిగా ఇవ్వాలన్న షరతు విధించటం వెనుక ప్రధాన కారణం టెరెస్ట్రియల్ ప్రేక్షకులకు అందించాలన్న ఆలోచనే. అయితే, టెరెస్ట్రియల్ ముసుగులో దూరదర్శన్ శాటిలైట్ ద్వారా కూడా పంపిణీ చేస్తున్నట్టు హక్కులు కొనుక్కున అ బ్రాడ్ కాస్టర్లు కోర్టుకెక్కటంతో అలాంటి ప్రసారాలు పంపిణీ చేయవద్దంటూ కోర్టు టీవీ పంపిణీ వేదికలకు ఆదేశాలు జారీచేయాల్సి వచ్చింది. ఆ విధంగా టెరెస్ట్రియల్, శాటిలైట్ మధ్య తేడా మరోమారు స్పష్టమైంది.

ఇప్పుడు రకరకాల కారణాలవల్ల టెరెస్ట్రియల్ టవరాలు మూసివేస్తున్నారు. అందులో ప్రధానమైనవి:

1. 2023 నాటికి అనలాగ్ ట్రాన్స్ మిషన్ పూర్తి చేయాలని అంతర్జాతీయ ఒప్పందానికి కట్టుబడటం

2. సాంకేతిక అభివృద్ధి కారణంగా అనలాగ్ టెక్నాలజీ పనికిరాని పరిస్థితి రావటం, ఆర్థికంగా బరువు కావటం, ప్రేక్షకుల సంఖ్య చాలా కనీస స్థాయికి వెళ్ళటం

3. ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ను మరింత మెరుగ్గా వాడుకునేలా ప్రభుత్వానికి అప్పగించటం 4. ప్రస్తుత పరిస్థితుల్లో సంస్థ అదనపు భారాన్ని తగ్గించుకునేందుకు సిబ్బందిలో కోత విధించటం 5. ఫ్రీడిష్ లాంటి ప్రత్యామ్నాయ వేదికల ద్వారా మెరుగ్గా ప్రజలకు అందుబాటులోకి తీసుకువెళ్లటంఅయితే ప్రసార భారతి తరఫున వచ్చిన ఉచిత డీటీహెచ్ వేదిక డీడీ ఫ్రీడిష్ వలన దూరదర్శన్ చానల్స్ అనే సౌకర్యవంతంగా నాణ్యంగా, ఎలాంటి అవాంతరాలూ లేకుండా అందుతూ ఉండటంతో చాలామంది టెరెస్ట్రియల్ టీవీ ప్రేక్షకులు అటువైపు మొగ్గు చూపారు. కేవలం డిష్, బాక్స్ కొనుక్కుంటే నెలవారీ చందా అవసరం లేకుండా ఛాన్సల్ చూసే సౌకర్యం ఉండటం దీని ప్రత్యేకత. దీనికి ప్రేక్షకాదరణ పెరుగుతూ రావటంతో ప్రైవేట్ చానల్స్ కూడా పోటాపోటీగా ఇందులో చేరటం, ఫ్రీడిష్ కనెక్షన్ల సంఖ్య నాలుగు కోట్లకు చేరటం చెప్పుకోదగ్గ పరిణామం. ఇప్పుడు టెరెస్ట్రియల్ టీవీకి పూర్తిగా స్వస్తి పలకటమంటే పరోక్షంగా ఆ ప్రేక్షకులను కూడా ఫ్రీడిష్ వైపు ఆకర్షించేందుకేనని అర్థమవుతోంది.

వ్యూహాత్మకంగా కీలకమైన జమ్ము కశ్మీర్, లద్దాఖ్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవులు, లక్ష దీవులలో ఉన్న 54 ఏటీటీ లు మాత్రం కొనసాగుతాయి. ఈశాన్య రాష్ట్రాలలో ఉన్న 43, డిజిటల్ కు సిద్ధమై ఉన్న 108 కలిసి మొత్తం 151 ఏటీటీ లు వచ్చే మార్చి 31 నాటికి మూతబడతాయి. ప్రస్తుతం వాటిని ఒక షిఫ్ట్ లో అంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నిర్వహిస్తారు. సరిహద్దుల్లో ఉన్న 109 ఏటీటీలు ప్రస్తుతం ఒక షిఫ్ట్ లో నడిపి ఈ డిసెంబర్ ఆఖరుకే మూసేస్తారు. ఈ లోపు డీడీ ఫ్రీడిష్ ప్రచారం అందులో కొనసాగిస్తారు. మిగిలిన ప్రాంతాల్లో ఉన్న 152 ఏటీటీ లు ఈ అక్టోబర్ 31 నాటికే మూతపడతాయి. తాజా నిర్ణయం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ లో కడప, ఒంగోల్, నెల్లూరు, కాకినాడ, శ్రీకాకుళం, మందస, టెక్కలి, నరసరావుపేట, పెదనందిపాడు, వినుకొండ లో ఉన్న లో పవర్ ట్రాన్స్ మిటర్లు (ఎల్ పిటి) , అనంతపూర్, విశాఖపట్నం, రాజమండ్రి. కర్నూలు, నంద్యాల, తిరుపతి, లోని హై పవర్ ట్రాన్స్ మిటర్ (హెచ్ పి టి) లు మూతపడుతున్నాయి. తెలంగాణలో బెల్లంపల్లి, బాన్స్ వాడ, కామారెడ్డి, సిర్పూర్, దేవరకొండ, నల్గొండ, కొత్తగూడెం, ఖమ్మం, ఆదిలాబాద్, ఎల్ పి టి లు, వరంగల్, మహబూబ్ నగర్ హెచ్ పి టి మూతపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here