బ్రాడ్ కాస్టర్లు టారిఫ్ ఆర్డర్ల సవరణను విమర్శించటం అర్థరహితమని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) చైర్మన్ ఆర్ ఎస్ శర్మ స్పష్టం చేశారు. సవరణ వలన చానల్స్ కు గిట్టుబాటు కాదని, పే టీవీ వ్యవస్థ దెబ్బతింటుందని ఆరోపించటాన్ని ఆయన తప్పుబట్టారు.
ప్రజల ప్రయోజనాలను , పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ట్రాయ్ సరైన నిర్ణయం తీసుకున్న దని ఆయన కొత్త టారిఫ్ ఆర్డర్ ను సమర్థించారు. ప్రజలను ఇష్టం లేని చానల్స్ కూడా చూసేలా వత్తిడి చేయటాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. “800-900 చానల్స్ లో మా లెక్కల ప్రకారమే దేశంలో 90% మంది ప్రజలు 50 చానల్స్ మించి చూడటం లేదు” అన్నారు. టీవీ చానల్స్ తో పోల్చుకుంటే ఏది చూడాలనుకుంటే అదే చూసేలా ఒటిటి వేదికలు మరింత స్వేచ్ఛ ఇస్తున్నాయన్నారు. అందుకే చాలామంది టీవీని వదిలి ఒటిటి వైపు వెళుతున్నారని ట్రాయ్ చైర్మవ్యాఖ్యానించారు.
” అందువల్ల కొత్త టారిఫ్ ఉత్తర్వులు, సవరణలు పరిశ్రమ ప్రయోజనాలకు వ్యతిరేకమనటం అర్థరహితం. ప్రజల, పరిశ్రమ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ట్రాయ్ సరైన నిర్ణయమే తీసుకుంది. చూడదలచుకోని చానల్స్ చూదాల్సిందిగా ఎవరినీ వత్తిడి చేయకూడదు. ” అన్నారు. గవర్నెన్స్ నౌ ఎండీ కైలాస్ నాథ్ అధికారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విజనరీ టాల్స్ లో శర్మ మాట్లాడారు.
ట్రాయ్ సవరించిన టారిఫ్ ఆర్డర్ వల్ల బ్రాడ్ కాస్టర్లు తీవ్రంగా ప్రభావితమవుతారంటూ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్) ప్రకటన మీద ఆయన స్పందించారు. నియంత్రణలో లేని వేదికలతో పోటీకి నిలబడటం పే టీవీ బ్రాడ్ కాస్టర్లకు సాధ్యం కాదన్న వాదనను కూడా ఆయన త్రోసిపుచ్చారు. పరిస్థితి ఇలా సాగితే అనేక చానల్స్ మూతపడతాయన్న ఐబిఎఫ్ వాదనలో పసలేదన్నారు.
వ్యవహారం కోర్టులో ఉన్నందున ఇంతకు మించి మాట్లాడలేనని చెబుతూ, ఐబిఎఫ్ చేసిన ప్రకటన కేవలం ప్రజల్లో భయాలు నింపటానికే పనికొస్తుందన్నారు. చానల్స్ మూతపడతాయని పదే పదే చెప్పటం బెదరింపు కాదా అని ప్రశ్నించారు.” మీకేం హక్కుంది? మీరు కోర్టుకు వెళ్ళారు కదా. కోర్టే నిర్ణయించనివ్వండి. ప్రజలకోణం చూడకుండా చట్టపరమా కాదా అనే విషయానికే ప్రాధాన్యమిస్తున్నారు. నిర్ణయాన్ని సవాలు చేసుకోవటానికి చట్టపరమైన వేదికలున్నాయి. అక్కడికి వెళ్ళాక వేచి ఉండాలి. అంతే తప్ప అర్థం పర్థం లేని ప్రకటనలు చేయటం వలన ఎలాంటి ప్రయోజనమూ ఉండదు” అన్నారు.
అయితే, కేబుల్ వ్యాపారాన్ని దెబ్బతీసే ట్రాయ్ నిర్ణయం మీద మాత్రం ఆయన ఏమీ మాట్లాడలేదు. డబ్బునవాళ్లు రెండో టీవీ కనెక్షన్ తీసుకుంటే వాళ్ళకు రాయితీ ఇవ్వలని కొత్త నిబంధన విధించటం పట్ల కేబుల్ టీవీ అసంతృప్తితో ఉంది. అదే విధంగా కనీసం 200 చానల్స్ ఇవ్వాలన్న నిబంధన విధించటం వల్ల డిజిటల్ ఎమ్మెస్వోలు తమ హెడ్ ఎండ్ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంటుందని, ఈ భారాన్ని దృష్టిలో పెట్టుకోకుండా నిబంధనను సవరించటం సరైన నిర్ణయం కాదని కేబుల్ రంగం తీవ్ర అసంతృప్తితో ఉంది.