కేబుల్ టీవీ ప్రేక్షకులకు ఊరట

0
1658

కేబుల్ టీవీ ప్రేక్షకులకు ఊరట
• కొత్త టారిఫ్ ఆర్డర్ ను సమర్థించిన బొంబాయ్ హైకోర్ట్
• పే చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ. 19 నుంచి రూ.12 కు తగ్గింపు
• రూ.130 కనీస చందాతో 100 చానల్స్ కు బదులు 200 ఎంచుకునే అవకాశం; 26 డిడి చానల్స్ అదనం
• బొకే ధరల మీద కూడా కట్టడి
• బొకేల జంట నిబంధనలలో ఒకదాన్ని కొట్టేసిన హైకోర్ట్
బ్రాడ్ కాస్టర్లకూ, టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకూ మధ్య ఏడాదిన్నర పాటు సాగిన సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం కొత్త టారిఫ్ మీద బొంబాయ్ హైకోర్ట్ ఈ రోజు తీర్పు వెలువరించింది. ప్రధానంగా టారిఫ్ విషయంలో జంట నిబంధనలలో ఒకదానికి మాత్రమే ఆమోదం లభించగా మిగిలిన అన్ని అంశాలలో టాయ్ నిర్దేశించిన నియమాలను కోర్టు సమర్థించింది. ఆరు వారాలపాటు వత్తిడి చేయకుండా అమలు చేయటానికి అవకాశం ఇవ్వాలని కూడా ట్రాయ్ ని కోర్టు ఆదేశించింది.
బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సేవలకు సంబంధించి ట్రాయ్ సవరణలు చేస్తూ 2020 జనవరి 1న రెండో టారిఫ్ ఆర్డర్ (ఎన్టీవో 2.0) విడుదల చేసింది. వినియోగదారులు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కారంగా పేర్కొంటూ బ్రాడ్ కాస్టర్ల, పంపిణీ సంస్థల ప్రయోజనాల మధ్య సమతుల్యత సాధించటానికి ఈ సవరణలు చేసినట్టు ట్రాయ్ చెప్పుకుంది. మార్కెట్ లో కొన్ని అవకతవకలను సరిదిద్దటానికి, ఈ రంగం ఒక క్రమపద్ధతిలో ఎదగటానికి ఈ సవరణలు పనికొస్తాయని ట్రాయ్ ఆ సందర్భంగా ప్రకటించింది. అయితే, బ్రాడ్ కాస్టర్లు కోర్టుకు వెళ్ళటంతో 2020 అక్టోబర్ 9న వాదోపవాదాలు పూర్తి కాగా అప్పటినుంచి తీర్పు రిజర్వ్ లో ఉంది.
ప్రధానంగా వినియోగదారుల కోణంలో చూస్తే, ఉచిత చానల్స్ ఇంతకు ముందున్న 100 కు బదులుగా ఇప్పుడు 200 ఎంచుకునే అవకాశముంది. పైగా, అంతకుముందు ఆ 100 లోనే ప్రసార భారతి వారి 26 చానల్స్ కూడా ఉండగా ఇప్పుడు 200కు అదనంగా ఇవి ఉంటాయని చెప్పింది. అదే విధంగా ఒక ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ టీవీలు ఉంటే మొదటి టీవీకి మాత్రమే 130 రూపాయలు ప్లస్ జీ ఎస్టీ కట్టి, ఆ తరువాత ఒక్కో చానల్ కు 40% చొప్పున, అంటే 52 రూపాయలు ప్లస్ జీఎస్టీ చొప్పున కడితే సరిపోతుంది.
అదే విధంగా కారేజ్ ఫీజు విషయంలో బ్రాడ్ కాస్టర్ల అభ్యంతరాలకు కూడా పరిష్కారం కనుక్కునే ప్రయత్నం చేసింది. ఒక పంపిణీ సంస్థ తన లక్షిత మార్కెట్ ను ఒక రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతానికే పరిమితం చేసి లెక్కించాలని చెప్పింది. గరిష్ఠంగా ఒక నెట్ వర్క్ నెలకు ఒక్కో చానల్ కు 4 లక్షలకు మించి కారేజ్ ఫీజ్ వసూలు చేయకూడదని కూడా నిర్దేశించింది. చిన్న చానల్స్ కు, ప్రాంతీయ చానల్స్ కు ఇది కొంత మేలు చేస్తుంది.
ఇక బ్రాడ్ కాస్టర్ల విషయానికొస్తే, చాలా మంది తమ చానల్స్ నుంచి వసూలు చేసే ప్లేస్ మెంట్ ఫీజ్ విషయంలో అన్యాయం జరుగుతోందని, చీటికి మాటికి నెంబర్లు మారుస్తున్నారని ఫిర్యాదు చేస్తుండగా ట్రాయ్ దీనికి పరిష్కారమార్గం సూచించింది. పంపిణీ సంస్థలు ( ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు) భాష, చానల్ వర్గం ఆధారంగా వాటికి నిర్దిష్టమైన స్థానం ఇవ్వాలని చెప్పింది. అంటే, ఒక భాషకు చెందిన అన్ని మ్యూజిక్ చానల్స్ ఒకచోట, న్యూస్ చానల్స్ ఒకచోట…. ఉండేలా నెంబర్లు ఇవ్వాలి. దానివలన చిన్న చానల్స్ స్థానాన్ని పదే పదే మార్చి ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. దీనికి కూడా కోర్టు ఆమోదం తెలియజేసింది.
ఇక అన్నిటికంటే ప్రధానమైనది చానల్స్ ధర నిర్ణయం. ఇంతకుముందు బొకేలో పెట్టదలచుకున్న చానల్ గరిష్ఠ చిల్లర ధర రూ.19 వరకు ఉండవచ్చునని చెప్పగా, ఈ పరిమితి దాకా వాడుకోవటానికి ఉత్సాహం చూపుతూ 100% మించి ధర పెంచిన చానల్స్ చాలా ఉన్నాయి. అందుకే ఎవరైనా బ్రాడ్ కాస్టర్ తన చానల్ ను బొకేలో పెట్టదలచుకుంటే దాని గరిష్ఠ చిల్లర ధర 12 రూపాయలకు మించకూడదు అని ట్రాయ్ తన తాజా టారిఫ్ ఆర్డర్ లో స్పష్టం చేసింది.
ఇక బొకేల వొషయానికొస్తే, ట్రాయ్ రెండు జంట నిబంధనలు పెట్టింది. ఒక బొకేలో పెట్టిన చానల్స్ మొత్తం ధరలు కలిపినా బొకే ధర కు ఒకటిన్నర రెట్లు మించకూడదు అని. అంటే, ఇష్టమొచ్చినట్టు ధర పెంచి, బొకే ధర తక్కువగా నిర్ణయించి మొత్తం బొకే తీసుకునేట్టు చేసే దురాలోచనకు తావుండకూడదని కొత్త టారిఫ్ ఆర్డర్ లో స్పష్టం చేసింది. ఇది మొదటి నిబంధన.
అదే సమయంలో ఇలాంటిదే మరో నిబంధన కూడా పెట్టింది. బొకే లో ఉన్న చానల్స్ అ లా కార్టే ధరల సగటు ధరకు మూడు రెట్లు మించి ఆ బొకే లోని ఏ చానల్ ధర కూడా ఉండకూడదు. అయితే, ట్రాయ్ పెట్టిన ఈ నిబంధనను మాత్రం బొంబాయ్ హైకోర్టు త్రోసిపుచ్చింది. దీంతో బ్రాడ్ కాస్టర్లకు కొంతమేరకు ఊరట లభించినట్టయింది. కానీ ఈ నిబంధనలకు అనుగుణంగా బొకేలు తయారు చేయటంలో ఎలాంటి తెలివితేటలు ప్రదర్శిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కొత్త నిబంధనల అమలుకు కనీసం 6 వారాల పాటు బలవంతం చేయవద్దని కూడా ట్రాయ్ ని కోర్టు ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here