అఖిల భారత డిజిటల్ కేబుల్ సమాఖ్య కొత్త అధ్యక్షునిగా జిటిపిఎల్ హాత్ వే ఎందీ అనిరుధ్ సింహ్ జడేజా నియమితులయ్యారు. ఇప్పటివరకూ అధ్యక్ష స్థానంలో ఉన్న డెన్ నెట్ వర్క్స్ సీఈవో ఎస్ ఎన్ శర్మ పదవీకాలం మార్చి 31 తో పూర్తవటంతోఈ ఈ నియామకం అనివార్యమైంది. జడేజాకు కేబుల్ రంగంలో విశేష అనుభవముంది. 2006 లో ఆయన జిటిపిఎల్ హాత్ వే సంస్థను నెలకొల్పారు. ఆయన వ్యూహాత్మక దురదృష్టి కేబుల్ రంగంలో వ్యాపారం పెరుగుదలకు దోహదం చేసింది.
ఇప్పటిదాకా అధ్యక్షునిగా ఉన్న శర్మ తన వీడ్కోలు ప్రసంగంలో కొత్త అధ్యక్షుని ప్రతిభను ప్రశంసించారు కేబుల్ పరిశ్రమ కొంతకాలంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కుంటు వచ్చిందని, మరీ ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం కారణంగా నిర్వహణాపరమైన చిక్కులు ఎదుర్కొవాల్సి వచ్చిందని గుర్తు చేశారు. అయితే బలంగా వేళ్ళూనుకొని ఉండటం వలన అన్ని రకాల ఆటుపోట్లకూ తట్టుకొని నిలబడగలిగిందన్నారు. రానున్న కాలంలో కూడా అన్ని రకాల వరోధాలను తట్టుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
కొత్త అధ్యక్షుడు జడేజా మాట్లాడుతూ, ఈ సమాఖ్య కేబుల్ పరిశ్రమలోని అందరినీ కలుపుకుపోతూ, పరిశ్రమ ఎదుగుదలకు కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. వివిధ వేదికలమీద ఈ రంగం సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సాంకేతికంగా ఈ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నందున అంతిమంగా వినియోగదారులు లాభం చేకూర్చేందుకు అవసరమైన అన్ని మార్పులనూ ఆహ్వానిస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న డిజిటల్ ఎమ్మెస్వోల ఉమ్మడి వేదికగా ఉన్న ఆలిండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్ ఈ రంగపు అభివృద్ధి కోసం కృషి చేసే సంస్థ. కేబుల్ టీవీ రంగం సంపూర్ణ డిజిటైజేషన్ దిశలో నదవటానికి ఎంతగానో కృషి చేసింది. బ్రాడ్ బాండ్ సహా డిజిటల్ సేవలు ఇంటింటికీ అందటానికి కేబుల్ రంగాన్ని వాడాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ట్రాయ్ నిబంధనలకు లొబడి పనిచేస్తూనే ఈ రంగానికున్న ప్రత్యేక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. అ విధంగా నిజమైన డిజిటల్ ఇండియా సాకారానికి దోహదపడుతుంది.